ఇప్పటివరకు ఎవరిపైనైనా రాజకీయ ప్రేరేపిత ఒక్క కేసైనా పెట్టినమా? ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? తెలంగాణలో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా, చిన్నదైనా చెదురుమదరు సంఘటనలు జరిగాయో చెప్పండి
– సీఎం రేవంత్రెడ్డి (ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశంలో)
CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాజకీయ ప్రేరేపిత కేసులు ఒక్కటీ పెట్టలేదంటూనే.. బీఆర్ఎస్ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెడుతూ సీఎం రేవంత్ సన్నాయి నొక్కులు నొక్కటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని అణచివేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నదని.. ఇందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై పెట్టిన కేసులే ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ నేతలు క్రిశాంక్, కొణతం దిలీప్పై ప్రభుత్వం ఇటీవల వరుస కేసులు నమోదు చేసింది. అయితే వీళ్లు నేరం చేశారని కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కేసులు నమోదయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఆర్డీసీ లోగోలు మార్పులు చేసిందంటూ ఓ లోగో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీన్ని గమనించిన కొణతం దిలీప్ అందులో కాకతీయ తోరణం లేదంటూ ట్యాగ్ చేశారు. దీంతో ప్రభుత్వాన్ని బద్నాం చేశారనే నెపంతో ఆయనపై ప్రభుత్వం కేసు పెట్టింది. కరెంట్ రావటం లేదంటూ ప్రశ్నించిన మరో బీఆర్ఎస్ నేత క్రిశాంక్పైనా కేసు పెట్టి జైలుకు పంపించింది. తాజాగా కరీంనగర్ జడ్పీ సమావేశంలో పేద విద్యార్థులకు సంబంధించి చదువు, సౌకర్యాలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు.
అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో ఆయనపై ప్రభు త్వం కేసు నమోదు చేసింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపైనా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎమ్మెల్యేకు దక్కాల్సిన ప్రొటోకాల్పై ప్రశ్నించటమే ఆమె చేసిన నేరమైంది. వరుస ఘటనల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా కేసులు పెట్టే ఆచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి.