హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వైఖరికి నిరసనగా 15న నిరుద్యోగులతో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రకటించారు. తెలంగాణ నిరుద్యోగులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి దగాచేసిన వైనాన్ని జాతీయస్థాయిలో ఎండగడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డిని నిరుద్యోగులే గద్దె దించుతారని స్పష్టం చేశారు.
హైదరాబాద్ గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్కు మద్దతుగా శనివారం అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం వద్ద నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్కు ప్రాణహాని జరిగితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ఆరోగ్యంపై లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు రాహుల్గాంధీని అశోక్నగర్ చౌరస్తాలో టీ తాగించి, డ్రామాలాడించి, నిరుద్యోగులను రెచ్చగొటి,్ట వారి ద్వారా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు వారి పట్ల నిర్లక్ష్యం వహించడం అత్యంత హేయమని చర్యగా పేర్కొన్నారు. ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఇచ్చిన మాటను నేడు విస్మరించడాన్ని తప్పుబట్టారు.
గ్రూప్-2లో 2,000, గ్రూప్-3లో 3,000 వరకు పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు. డీఎస్సీలో టీచర్ పోస్టుల సంఖ్యను 25 వేలకు పెంచాలని, రూ.4,000 నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు సంజీవ నాయక్, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షుడు కొంపల్లి రాజు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ జనసభ రాష్ట్ర నాయకుడు తొడంగి గోవర్ధన్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజు, శ్రీకృష్ణ యాదవ సంఘం యాదద్రి జిల్లా అధ్యక్షుడు పుట్ట వీరేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్స్టేషన్ ముట్టడి
సిరికొండ, జూన్ 29: కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శనివారం స్థానిక సబ్స్టేషన్ను ముట్టడించారు. కొంత కాలంగా విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. లో వోల్టేజ్తో ఇళ్లల్లో ఫ్రిజ్లు, టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏఈ చంద్రశేఖర్ స్పందిస్తూ త్వరలోనే విద్యుత్తు సమస్యను పరిష్కరిస్తామని, అవసరమైనచోట స్తంభాలు వేయిస్తామని హామీ ఇచ్చారు.
‘గృహజ్యోతి’కి కష్టం
గృహజ్యోతి పథకం కోసం ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. గతంలో ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినా ఆన్లైన్లో నమోదు చేసినా వివరాలు సక్రమంగా లేకపోవడంతో చాలా మందికి జీరో కరెంట్ బిల్లుకు అర్హులు కాలేదు. మరోసారి ఈ పథకానికి లబ్ధిదారులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఉమ్మడి మండల వాసులు శనివారం ఎంపీడీవో కార్యాలయానికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సర్వర్ ప్రాబ్లం ఏర్పడటంతో గంటల తరబడి క్యూలో నిలబడిన ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. – దేవరకద్ర
డీఎస్సీ వాయిదా వేయాలి
ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద శనివారం నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. వందలాది మంది ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు అదనంగా పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ షెడ్యూల్ను మూడు నెలలపాటు వాయిదా వేయాలని, ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీలోనే కలపాలని డిమాండ్ చేశారు.- ఖమ్మం ఎడ్యుకేషన్
ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరసన
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం సాయంత్రం విద్యార్థులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఐటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సోలిడారిటీ (టీఎస్ఏఎస్) ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు వంద మంది విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. – బాసర