CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర రాజధానిలో ఉంటూ పాలన సాగించాలి. సీఎం రేవంత్రెడ్డి అందుకు భిన్నంగా దేశ రాజధానిలో ఎక్కువగా కనిపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సీఎం కేరాఫ్ ఢిల్లీ’గా మారారని, ముఖ్యమంత్రిని హైదరాబాద్లో కన్నా ఢిల్లీలో అయితే సులభంగా కలువొచ్చని రాజకీయ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 7వ తేదీకి ఏడు నెలలు పూర్తి కావొస్తున్నది.ఇప్పటివరకు ఆయన 17 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు.సగటున నెలకు 2,3 సార్లు ఢిల్లీ వెళుతున్నట్టు చెప్తున్నారు. కేంద్రప్రభుత్వ పెద్దలను కలవటం తప్పేమీ కాదని, ప్రతిసారి కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చలు జరుపుతున్నారని గుర్తుచేస్తున్నారు. ఎటూ తెగని చర్చలతో కాలం వృథా అవుతున్నదని విమర్శిస్తున్నారు. గత నెల రోజుల్లో ఇది పరాకాష్టకు చేరిందని అంటున్నారు.
జూన్ 4 – జూలై 4 మధ్య మూడు సార్లు ఢిల్లీకి వెళ్లారని చెప్తున్నారు. మొదట జూన్ 8, 9 తేదీల్లో ఢిల్లీకి వెళ్లారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొన్నా రు. తర్వాత జూన్ 24న ఢిల్లీకి వెళ్లి ఐదు రోజులపాటు అక్కడే ఉన్నారు. ముగ్గురు కేంద్రమంత్రులను కలిసినా.. అసలు చర్చంతా మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టులపైనే జరిగింది. డిప్యూటీ సీఎం, ఏడుగురు మంత్రు లు.. ఢిల్లీలోనే కనిపించారు. ఐదు రోజులు హైడ్రామా కొనసాగినా ఫలితం తేలలేదు.
తాజాగా జూలై 3, 4 తేదీల్లో ఢిల్లీలో పర్యటించారు. 3న పూర్తిగా పదవుల పంపకంపై పార్టీ చర్చలకే పరిమితం కాగా, 4న ప్రధాని మోదీ, హోంమంత్రిని కలిశారు. మొత్తంగా 9 రోజులపాటు ఢిల్లీలోనే గడిపారని చెప్తున్నారు. అంటే మూడింట ఒక వంతు కాలం ఢిల్లీలోనే గడుపుతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిణామాలపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సగటున వారానికి రెండు రోజులు ఢిల్లీలో ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.