CM Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సంబంధించి 27 ఫోర్ వీలర్స్, 40 బైక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 ఫోర్ వీలర్స్, 30 బైక్లను ప్రభుత్వం అందజేసింది. ఈ కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించాం అని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్. నేరాలను ఎదుర్కోవడంలో రాష్ట్రంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోంది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి. దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఈ క్రమంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. చిన్నారులపై దాష్టీకం జరుగుతున్న ఘటనలకు కారణం మాదకద్రవ్యాలే. తెలంగాణ యువకులు డ్రగ్స్కు బానిసలు కాకుండా.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తాం. ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తాం. మీడియా.. రాజకీయ వివాదాలపై కాకుండా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది అని రేవంత్ పేర్కొన్నారు.