Telangana | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, సామ రామ్మోహన్రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్రెడ్డి, ఓయూ విద్యార్థి నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, చారకొండ వెంకటేశ్, కాల్వ సుజాత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 1: 50 నిష్పత్తి చొప్పున కాకుండా 1: 100 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలనే డిమాండ్ పై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చ జరిగింది. నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ మళ్లీ నిలిచిపోతుందని అధికారులు వివరించారు. నోటిఫికేషన్లో ఉన్న నిబంధనలను మార్చితే న్యాయపరంగా చెల్లుబాటు కాదని ముఖ్యమంత్రికి చెప్పారు. గ్రూప్ 1 పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నోటిఫికేషన్లో ఉన్న బయోమెట్రిక్ పద్ధతిని ఎందుకు పాటించలేదనే ఏకైక కారణంతో రాష్ట్ర హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే.. ముందుగా ఉన్నవాళ్లకు అన్యాయం జరిగినట్లే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు.
గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచటం కూడా నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్లే అవుతుందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. గ్రూప్- 1 కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు.
గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండటంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని, ఆ వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉండటంతో ప్రిపరేషన్ను ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.