Minister Ponguleti | వరంగల్, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజా నిర్ణయంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే ప్రాధాన్యత ఉండటంలేదని ఇన్ని రోజులు అసంతృప్తితో ఉన్న వీరు ఇప్పుడు జిల్లాల్లో, ఇంకా ముఖ్యంగా సొంత నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూన్ 29న వరంగల్ నగర పర్యటనకు వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
వరంగల్ నగర అభివృద్ధిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్సిటీ, మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంశాలపై చర్చించారు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇరవై రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తారని సీఎం చెప్పారు. 45 రోజుల్లో తాను మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క కూడా ఉన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షల బాధ్యతను వీరిద్దరికిగానీ, వీరిలో ఒకరికిగానీ అప్పగించకుండా ఇన్చార్జి మంత్రికి అప్పగించడంపై సమావేశంలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు చర్చించుకున్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షల బాధ్యతను ఇతర జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటికి అప్పగించడంపై స్థానిక మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
వరంగల్ నగర అభివృద్ధిపై ఇన్చార్జి మంత్రి సమీక్షించాలనే నిర్ణయంపై మంత్రి సురేఖతోపాటు నగర పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలు అసంతృప్తిగానే ఉన్నారు. వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి సైతం అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకునే విధాన నిర్ణయాలు, భారీ స్థాయిలో చేపట్టే పనులు, మాస్టర్ ప్లాన్ ఆమోదం వంటి వాటిపై ప్రభుత్వ స్థాయిలో పర్యవేక్షణ చేస్తే బాగుంటుందిగానీ.. అన్ని పనులను ఇన్చార్జి మంత్రి పర్యవేక్షించడం సరికాదని అంటున్నారు. గతంలోనూ ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు ఉండేవారని.. ప్రత్యేక అభివృద్ధి నిధుల మంజూరు, రాజకీయ పదవుల కేటాయింపు, సొంత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసం వీరు పని చేసేవారని గుర్తుచేస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని పనులపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్షించాలనే సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపై స్థానిక మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలపై మరో జిల్లా మంత్రి పెత్తనం సరికాదని అంటున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యవహారాలను జిల్లా ఇన్చార్జి పొంగులేటి పర్యవేక్షిస్తున్నారని, తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపైనా తమకు అధికారం లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరికపైనా మంత్రి సురేఖకు, ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్రెడ్డి మధ్య విబేధాలు నెలకొన్నాయి. తన నియోజకవర్గానికి చెందిన గుండు సుధారాణిని తనకు సమాచారం లేకుండానే కాంగ్రెస్లో చేర్పించేలా ఇన్చార్జి మంత్రి పొంగులేటి వ్యవహరించడంపై అప్పట్లోనే సురేఖ అసంతృప్తి వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరిగింది. అప్పటినుంచి ఇన్చార్జి మంత్రి పొంగులేటి, జిల్లా మంత్రి సురేఖ మధ్య అంతరం పెరిగినట్టు సమాచారం.