CM Revanth | హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హన్మకొండ కలెక్టరేట్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల పురోగతి, చేపట్టాల్సిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షిస్తున్నారు. నగరాభివృద్ధికి సంబంధించి ఇన్చార్జి మంత్రి ప్రతీ 20రోజులకోసారి సమీక్ష నిర్వహించాలన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్పై సైతం సమీక్షిస్తున్నారు. సీఎస్తో పాటు డీజీపీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు.
ఇన్నర్, ఔటర్రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్క్కు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నాలాలు ఆక్రమణలకు గురవకుండా చర్యలు చేపట్టాలన్నారు. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.