హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారులు ఇకపై పాలనపైనే దృష్టిసారించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం అన్ని విభాగాల కార్యదర్శులతో ఆయన సమావేమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో అయిదింటిని అమలు చేసిందని చెప్పారు. తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. ఇకపై ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని, తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని స్పష్టంచేశారు. అందరూ బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉన్నదని తెలిపారు. తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని వెల్లడించారు. ఒకో అధికారి ఒకో ఫ్లాగ్షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. సమయపాలనను తప్పనిసరిగా పాటించాలని, ప్రతిరోజు టైమ్ ప్రకారం సెక్రటేరియట్లో అందుబాటులో ఉండాలని అన్నారు. ఆఫీసులకే పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు క్షేత్రపర్యటనకు వెళ్లాలని ఆదేశించారు.
నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, తమ అనుభవంతో సుపరిపాలన విధానాలు అమలు చేయాలని సూచించారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చూడాలని ఆదేశించారు. దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు సందర్శించాలని చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలన్నింటా అధికారులు సత్వరమే స్పందించాలని స్పష్టం చేశారు.
అన్నిశాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం గుర్తుచేశారు. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, పని తీరు ఆధారంగానే ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని, సీఎం కార్యాలయం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. త్వరలోనే తాను వారానికో జిల్లా పర్యటనకు వెళ్తానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. త్వరలో షెడ్యూలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, 29 విభాగాలకు చెందిన ఐఏఎస్లు పాల్గొన్నారు.