హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను గవర్నర్కు వివరించారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గవర్నర్ను హైదరాబాద్లోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. రాధాకృష్ణన్ జార్ఖండ్ రాష్ర్టానికి పూర్తిస్థాయి గవర్నర్గా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటలపాటు గవర్నర్తో సమావేశమైన ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం కూడా రాజ్భవన్లోనే చేశారు.
ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, శాసనసభ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు, పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, వాటిపై హైకోర్టు ఆదేశాలు, సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఎన్నికలలో తాము ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీని ఆగస్టు 15 లోగా పూర్తిచేయడానికి రూపొందించుకున్న కార్యాచరణను సీఎం రేవంత్రెడ్డి వివరించినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై కూడా వారిద్దరు చర్చించినట్టు సమాచారం.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులలో ప్రస్తుతం నాలుగింటిని మాత్రమే భర్తీ చేయబోతున్నామని గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి వివరించినట్టు తెలిసింది. ఈ నెల 7 నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుండటంతో ఆ లోగా మంత్రివర్గ విస్తరణ జరగాలని భావిస్తున్నామని చెప్పినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణతోపాటు మంత్రుల శాఖలను కూడా మార్చబోతున్నామని చెప్పినట్టు తెలిసింది. ఇలా ఉండగా ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గ విస్తరణకు పార్టీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందడంతో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.