Congress Govt | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రోజులు దాటింది. రోజూ పార్టీ అంతర్గత చర్చల్లో మునిగి తేలుతున్నారు. చెప్పుకోవడానికి మొదటి మూడు రోజులు నలుగురు కేంద్రమంత్రులతో భేటీ అయినా, తర్వాత రెండు రోజులు మాత్రం పూర్తి సమయం ‘పెద్దల’ వద్దే గడిపారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం ఒక్కరే కాదు.. డిప్యూటీ సీఎం, ఏడుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లినవారిలో ఉన్నారు. కొందరు కొన్ని రోజులుగా అక్కడే మకాం వేయగా.. మరికొందరు అటెండెన్స్ వేసుకొని తిరిగి వచ్చేశారు. గత ఐదు రోజుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ముగ్గురు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ తప్ప మిగతా మంత్రులంతా హైదరాబాద్-ఢిల్లీ మధ్య చక్కర్లు కొట్టారు.
ఈ తతంగం మొత్తాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘పాలనను గాలికి వదిలేసి ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లినట్టుంది’ అని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుండటంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పుతున్నదని చెప్తున్నారు. ప్రతిరోజు పర్యవేక్షించాల్సిన, అత్యంత కీలకమైన శాఖలన్నీ సీఎం రేవంత్రెడ్డి దగ్గరే ఉన్నాయి. హోం, విద్య, మున్సిపల్ వంటి కీలక శాఖలన్నీ సీఎం వద్దే ఉన్నాయి. వరుస నేరాలతో రాష్ట్రంలో కొన్నిరోజులుగా పోలీసింగ్ గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లతో హడావుడిగా ఉన్నది. ఇలాంటి కీలక సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించాల్సిన సీఎం.. ఢిల్లీలో మకాం వేయటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.
పార్టీ చర్చలపైనే శ్రద్ధ
ఐదు రోజుల్లో సీఎం రేవంత్రెడ్డి పాలన కన్నా పార్టీ చర్చలపైనే శ్రద్ధ పెట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. ఎంపీల ప్రమాణస్వీకారం కోసం అంటూ ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ సోమవారం రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ కట్టర్, మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, బుధవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. గురు, శుక్రవారాల్లో పూర్తిగా పార్టీ చర్చలకే పరిమితం అయ్యారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అలక, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి నియామకం వంటివి చర్చిస్తున్నారు. వాస్తవానికి ఆయన గురువారం రాత్రి తెలంగాణకు వచ్చి.. శుక్రవారం వరంగల్లో పర్యటించాల్సి ఉన్నది. కానీ ఆ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేశారు.
ఇక.. జీవన్ రెడ్డి అంశం మినహా మిగతా అన్ని అంశాలపై కొన్ని వారాలుగా చర్చోప చర్చలు జరుగుతున్నవేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపుగా తుది నిర్ణయానికి వచ్చేసినట్టేనని అంటున్నాయి. వెంటనే నిర్ణయం ప్రకటించకుండా ఐదు రోజులుగా నాన్చుతున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో ఐదు రోజలుగా జరుగుతున్న పరిణామాలపై ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు చెప్పుకునేందుకు సచివాలయానికి వస్తే ఎవరూ అందుబాటులో ఉండటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు సైతం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తున్నది. ఇదే అదనుగా ఆయా శాఖల్లో అధికారులు ఆఫీస్ పనులపై పెద్దగా దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి కాంగ్రెస్లో సహజమే.. ప్రజలే మళ్లీ అలవాటుపడాలి అంటూ ఆ పార్టీ నేత ఒకరు చెప్పడం కొసమెరుపు.