CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో స్థానం లభిస్తుందని స్పష్టంచేశారు. సీఎం శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓడిన వా రికి నామినేటెడ్ పదవులు ఇవ్వబోమని స్పష్టంచేశారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. రెండింటిపై తుది నిర్ణ యం ఒకేసారి తీసుకుంటారని చెప్పా రు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి? ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి? అనేది నిర్ణయిస్తారని వెల్లడించారు.
సామాజిక కోణంలో పీసీసీ ఎంపిక ఉంటుందని, మహిళలకు ఇచ్చినా బాగానే ఉంటుందని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ల పోస్టింగ్స్ నిబంధనల మేరకే జరుగుతాయని స్పష్టంచేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వం ప్రతినెల రూ.350 కోట్లు చెల్లిస్తున్నదని వివరించారు. దీంతో నిర్వహణ నష్టాలు తగ్గాయని, ఆక్యుపెన్సీ 30 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందని వెల్లడించారు. గత అప్పులతో సంబంధం లేకుండా చుస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాలతో నడుస్తున్నదని చెప్పారు.
ధరణిలో ఉన్న లోపాలు సరిచేసే పనిలో ఉన్నామని, పేరు మార్పుపై తర్వాత ఆలోచిస్తామని అన్నారు. భూముల రికార్డులను కంప్యూటరైజ్డ్ చేయాలా? గతంలో మాదిరిగా మాన్యువల్ పద్ధతి పాటించాలా? అనేది అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మండలాలు, రెవెన్యూ డివిజన్ల మార్పుపై కమిషన్ నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదని, రూ.లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్స్ ఉన్నాయని వివరించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు రూ.6,500 కోట్లు కట్టేవారని, ఇప్పుడు నెలకు రూ.7వేల కోట్లు అప్పులు కడుతున్నామని చెప్పారు.
అదానీకి ఇస్తే తప్పేముంది
పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగించామని, అందులో తప్పేముందని సీఎం ప్రశ్నించారు. అకడ అండర్ గ్రౌండ్ విద్యుత్తు లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అదానీకి అప్పగించడాన్ని రాహుల్ గాంధీ తప్పు పడుతున్నారని, అంతేతప్ప అదానీతో వ్యాపారం చేయొద్దని ఎప్పుడూ అనలేదన్నారు.