CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరడంతోపాటు ముఖ్యమంత్రిని కావాలనే తన కోరిక తీరిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తన ముందున్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసిందని, ఆ స్థానంలో ఎవరిని నియమించినా కలిసి పని చేస్తానని చెప్పారు. తన పదవీ కాలంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో తమ ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేశారని.. అందుకే బీజేపీ బలం పెరిగిందని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందని ఆరోపించారు. బీఆర్ఎస్కు డిపాజిట్లు వచ్చిన చోట తాము గెలిచామని, బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచిందని అన్నారు. తాను కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని లోక్సభలో జీరో చేశామని.. ఆ పార్టీని సున్నా చేయాలన్న తన కోరిక నెరవేరిందని తెలిపారు.
ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ పార్టీ గగ్గోలు పెడుతున్నదని రేవంత్రెడ్డి విమర్శించారు. ఫిరాయింపులకు అసలు పునాదులు వేసింది ఎవరని ప్రశ్నించారు. 61 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను లాగేసుకున్నది ఎవరు? అని నిలదీశారు. ఆ పార్టీ చేసిన పాపాలకు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వం పడిపోతుందని, వంద రోజులు కూడా ఉండదని ప్రచారం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్, హరీశ్ వంతపాడారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వం పడిపోతుందంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చేతబడి చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వాడిని చూస్తూ కూర్చుంటామా? చెట్టుకు కట్టేయమా? అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో 17 లోక్సభ సీట్లలోనూ ఓడిపోయి, 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయి, 14 చోట్ల మూడో స్థానంలో నిలిచాక కూడా కేసీఆర్కు కనువిప్పు కలగలేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 16 శాతానికి పడిపోయాయని అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో బీజేపీకి ఫస్ట్ ప్లేస్ వస్తుందా? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఎంతగా కలిసి పనిచేశాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. సిద్దిపేటలో బీజేపీ, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వచ్చాయని.. కంచుకోట మెదక్లో బీఆర్ఎస్ మూడోస్థానంలో నిలిచిందని కాబట్టి కేసీఆర్కు ఇకనైనా కనువిప్పు కలిగితే మంచిదని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చిన్న ఘటన కూడా జరగలేదని రేవంత్రెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో ఎన్నికల తర్వాత 40, 50 మంది అధికారులను తొలగించారని గుర్తుచేశారు. ఇక్కడ చివరికు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తమపై ఫిర్యాదు చేయలేకపోయిందని తెలిపారు. పాలనను సమర్థంగా నిర్వహించడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని మతాల పండుగలు బ్రహ్మాండంగా జరిగాయని, మతపరమైన హింస ఎక్కడా చిన్నది కూడా జరగలేదని చెప్పారు. ఒక్క రాజకీయ ప్రేరేపిత కేసు కూడా పెట్టలేదని తెలిపారు. దీనిని బట్టి పాలన బాగున్నట్టా? బాగా లేనట్టా? అని ప్రశ్నించారు. తమ పాలనను ఇతర రాష్ర్టాలతో పోల్చి చెప్పాలని కోరారు. కేంద్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంతో బీజేపీ రాష్ర్టాలు కూడా అపాయింట్మెంట్ తీసుకోలేదని, తామే మొదటగా వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకున్నామని చెప్పారు.
రాజకీయ పార్టీలు నడిపే పత్రికలు, టీవీల మాయలో ఇతర మీడియా పడవద్దని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఆ మీడియాకు వారి రాజకీయ పార్టీల ప్రయోజనాలను కాపాడటానికి తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అలా చేయడంలో తప్పులేదని, అయితే మిగతా మీడియా కూడా వారి మాయలో పడి కొట్టుకుపోతున్నదని అన్నారు.