Revanth Reddy | మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు ప్రారంభమయ్యాయని సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. ఎవర్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలి? ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలో సామాజిక న్యాయం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీల్లో ఎవరినైనా పీసీసీ చీఫ్గా ఎంపిక చేయవచ్చని పేర్కొన్నారు. మహిళలకు కూడా పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఇస్తే బాగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ బీ ఫారం మీద గెలిచిన వారికే మంత్రి పదవుల్లో స్థానం ఉంటుందన్నారు.
పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ప్రత్యేకం కాదని ఆయన అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలు ఫిరాయించారని చెప్పారు. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలతో ఏకంగా పార్టీనే.. బీజేపీ విలీనం చేసుకుందన్నారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి తప్ప.. సంపన్నులకు కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పదేళ్లలో రూ.16లక్షల కోట్లను కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరూ ప్రశ్నించరని.. మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుబడుతున్నారని అన్నారు.