వరంగల్, జూన్29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హెల్త్, ఎకో టూరిజం సిటీగా వరంగల్ను అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మల్టీ సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. హనుమకొండ సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రులు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్(2050)ను రూపొందించాలని అధికారులకు సూచించారు. మామునూరు ఎయిర్పోర్టుకు, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు నిర్మాణాలకు భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి డీపీఆర్ను సిద్ధం చేయాలని ఆదేశించారు.మెగాటెక్స్టైల్ పారులో భూము లు కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారుల ను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధిపై 20 రోజులకు ఒకసారి ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, 45 రోజుల్లో మరోసారి తాను సమీక్ష నిర్వహిస్తానని సీఎం చెప్పారు. అనంతరం స్వశక్తి మహిళలకు రూ.518 కోట్ల71లక్షల 20వేల చెకును ముఖ్యమంత్రి అందజేశారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ అంచనా వ్యయం రూ.1100 కోట్లు నుంచి రూ.1726 కోట్లకు ఎందుకు పెరిగిందని అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఈపీసీ పద్ధతిన పనులు చేపడుతున్నందున అలా పెంచే వీలులేదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. హాస్పిటల్ భవన నిర్మాణ ఖర్చుపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్లో పొగడ మొక నాటి రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మం త్రులు సురేఖ, సీతక్క,రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్, ఎంపీలు కావ్య, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశస్వినీరెడ్డి, మురళీనాయక్, ఎమ్మెల్సీలు సారయ్య, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, టెసాబ్ చైర్మన్ ఎం రవీంద్రావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పీసీసీఎఫ్ రాకేశ్మోహన్ డోబ్రియల్, కలెక్టర్లు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్కు సీఎం వచ్చారని తెలుసుకుని ప్రజలు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ సమీక్ష నుంచి బయటికి వచ్చిన సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే ప్రభుత్వ బస్సులోకి ఎక్కారు. తమ వినతిపత్రాలను ఎవరూ తీసుకోకపోవడంతో కొందరు వాటిని బస్సుపై విసిరేశారు. సీఎంను కలిసేందుకు వచ్చిన 108 సిబ్బందిని కలెక్టరేట్ ఆవరణలోకి అనుమతించలేదు.
హనుమకొండ/సుబేదారి/దామెర/ వరంగల్: సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డిని, కార్యకర్తలను హనుమకొండలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హౌస్ అరెస్టయిన వారిలో రాకేశ్రెడ్డితో పాటు 2వ డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు ఎనిమిది మందిని సుబేదారి, ఇద్దరిని హనుమకొండ, ఐదుగురిని కేయూ పోలీసుస్టేషన్లకు తరలించా రు. సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న కేయూ విద్యార్థులను కేయూ పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులను అరెస్టు చేయడంతో పోలీస్స్టేషన్లోనే వారు నిరసన తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన సమయం లో ఎదురుగా ఉన్న సెంట్రల్ లైబ్రరీలో గ్రూప్స్కు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరుద్యోగులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు లైబ్రరీ గేట్కు తాళం వేశారు.
సీఎం పర్యటనకు సొంత పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన దొంతి మాధవరెడ్డి సీఎం సమీక్ష సమావేశానికీ హాజరు కాలేదు. పార్టీ కోసం పని చేసిన వారికి కాదని, కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని మాధవరెడ్డి అసంతృపితో ఉన్నారు. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి నుంచి దొంతి మాధవరెడ్డి దూరంగానే ఉంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్రెడ్డిని ఒక్కసారి కూడా దొంతి మాధవరెడ్డి కలవలేదని తెలిసింది.