ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర యాప్లతో డ్రైవర్లకు కమీషన్ల రూపంలో నష్టం చేకూరుతున్నది. ఉచిత బస్సుతో ఆటో, క్యాబ్లకు గిరాకీ లేదు. ఈ విషయాలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. డ్రైవర్ల సంక్షేమ బోర్డు, ప్రత్యేక యాప్ ఏర్పాటుపై డిసెంబర్లో నాంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో డ్రైవర్ల సంఘాల నేతల సమక్షంలో హామీ ఇచ్చారు. ప్రత్యేక యాప్ అమలు దిశగా అడుగులే వేయలేదు. ఇప్పటికైనా అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం.
-నగేశ్, బీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ యూనియన్ అధ్యక్షుడు
Auto App | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 ( నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రాకతో డ్రైవర్ల ఉపాధికి తొలి దెబ్బపడింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాయి. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని, డ్రైవర్ల సంక్షేమానికి టీహబ్ ద్వారా ప్రత్యేక యాప్ను తీసుకొస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. ఫలితంగా వివిధ డ్రైవర్ల సంఘాల నేతలు రగిలిపోతున్నారు. ఐదు నెలలైనా తమను ఆదుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగేందుకు సిద్ధమయ్యారు. ఉచిత బస్సు స్కీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గిరాకీ లేక తొలి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక, కుటుంబాలను పోషించుకోలేక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి దుస్థితిలో కొందరు ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం కనికరం చూపడం లేదని డ్రైవర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. మరోవైపు ఇతర రాష్ర్టాల వాహనాలు సైతం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని తొలుత డ్రైవర్లు పోరుబాట పట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్ల సంక్షేమం కోసం టీహబ్ ద్వారా ప్రత్యేక యాప్ తీసుకొస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంకా అమలుకాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను ఆదుకుంటామన్న మాటలు కూడా నీటిమూటలుగానే మిగిలిపోయాయని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే డ్రైవర్లను ఆదుకోవాలని, ప్రభుత్వమే యాప్ రూపొందించి అండగా నిలవాలని వివిధ వాహన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగుతామని వారు స్పష్టం చేస్తున్నారు.