నాడు నేను ఒక్కదాన్ని పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు నీ ప్రతిపక్ష హోదా పోయిందా? ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నీ వల్లే నా ప్రతిపక్ష హోదా పోయిందని ఎందుకు చెప్పలేదు? ఐదేండ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకొచ్చింది? అంటే.. ‘నువ్వు రేవంత్రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చినందువల్ల నాకు సీఎం పదవి రాకుండా పోయింది’ అనే ఫ్రస్ట్రేషన్ భట్టిలో కనిపిస్తున్నట్టు అర్థమవుతున్నది.
-సబితాఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తాము సభలో నాలుగున్నర గంటలు నిలబడితే సీఎం, అధికారపక్ష సభ్యులు రాక్షసానందం పొందారని, తమ ఇంటి ఆడబిడ్డలకు అలా జరిగితే అలాగే ప్రవర్తిస్తారా? అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల సమాజం వివక్ష చూపుతున్నదనే వాదనకు రెండు రోజులుగా అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బలాన్ని చేకూర్చాయని వారు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ పాలన, సోనియాగాంధీ నాయకత్వం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు జరిగిన అవమానం ఏ ఆడబిడ్డకూ రాకూడదని చెప్పారు. మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్న విషయాన్ని సభ దృష్టికి తెస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళలకు మైక్ ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, కేసీఆర్ లాంటి మహామహులు కూర్చున్న స్థానంలో రేవంత్రెడ్డి కూర్చున్నారని, తాము నాలుగున్నర గంటలపాటు నిలబడి తమ హక్కు కోసం పోరాడితే సభలో ఏ ఒక్కరి మనసు చలించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు మాట్లాడే అవకాశం కల్పించకపోయినా కనీసం ఆదివాసీ ఆడబిడ్డ కోవ లక్ష్మికి కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. తమను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అయితదనే రీతిలో సీఎం వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. రేవంత్ను నమ్మిన రాహుల్ బతుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అవుతుందా? అని ప్రశ్నించారు. సబితక్కను నమ్ముకున్నందుకే రేవంత్ సీఎం అయ్యారనే విషయాన్ని విస్మరించొద్దని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎం పదవికి కోసం కొట్లాడాల్సిందిపోయి నాడు ప్రతిపక్ష హోదా పోయిందనే వంకతో తన పట్ల అనుచితంగా మాట్లాడటం తనను మరింత వేదనకు గురిచేసిందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తమ ఖర్మ వల్ల రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉన్నవాళ్లు ఎంతమంది పార్టీలు మారలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్తో గెలిచిన ఎమ్మెల్యేలను ఏ మొహం ఉన్నదని కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సభలో లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించకూడదనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి మరచి ఎమ్మెల్సీ కవిత పేరును తేవడాన్ని తప్పుబట్టారు. లైంగికదాడులపై ప్రభుత్వం స్పందించేదాకా పోరాడుతా మని హెచ్చరించారు. సీ ఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పడం, చెప్పకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
నాలుగున్నర గంటలు అసెంబ్లీలో తాము నిల్చున్నా పాలకపక్షం స్పందించక పోగా హేళన చేసిందని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సభలో తాము అంతసేపు నిలబడితే మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమపై వివక్ష చూపడం ఒక ఎత్తయితే, కొత్త ఎమ్మెల్యేల మాటలు, చేష్టలు మరింత వేదనకు గురిచేశాయని పేర్కొన్నారు. తన ప్రచారానికి రావడం వల్లే సీఎం రేవంత్రెడ్డిపై కేసు లు నమోదయ్యాయని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. నాడు రేవంత్రెడ్డి ప్రసంగాల వల్లే తన మీద కేసులు నమోదయ్యాయని వివరించారు. కేసుల కొట్టివేత, మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కోసం తాను బీఆర్ఎస్లో చేరానని రేవంత్రెడ్డి పేర్కొనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చెప్పా రు. తనపై నమోదైన కేసులు కొట్టివేయలేదని, నర్సాపూర్ నుంచి నాంప ల్లి కోర్టుకు మారాయనే విషయాన్ని ఆయన విస్మరించారని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో తాను కూడా భాగస్వామ్యం అయ్యానని, సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడే అవకాశం ఇవ్వరా? అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సు నీతాలక్ష్మారెడ్డిని సీఎం రేవంత్రెడ్డి టార్గెట్ చేశారని విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎం కూడా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన వాఖ్యలను ఉపసంహరించుకుంటారని భావించామని, వారు అందుకు విరుద్ధంగా కించపరిచారని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ తమకు అండగా నిలిచిందని, అందుకు ముగ్గురూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.