CM Revant Reddy | భారత్మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఆ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వడంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రహదారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయోగంగా ఉండే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి, వెంటనే భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, దిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి- చిట్యాల, చౌటుప్పల్ అమన్గల్-షాద్ నగర్-సంగారెడ్డి, మరికల్- నారాయణపేట రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్-సిరిసిల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు-గద్వాల-రాయచూరు, కొత్తపల్లి- హుస్నాబాద్- జనగాం- హైదరాబాద్, సారపాక- ఏటూరునాగారం, దుద్దెడ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రధానమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.