Gurukul Recruitment | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): గురుకులంలో టీజీటీ పోస్టుకు ఎంపికైనట్టు ట్రిబ్ ప్రకటన.. ఫిబ్రవరిలో ఎల్బీస్టేడి యం వేదికగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదు గా అపాయింట్మెంట్ ఆర్డర్..! కానీ ఇప్పుడు పోస్టింగ్కు అనర్హురాలు అంటూ ఆమెను పక్కనబెట్టింది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్కు చెందిన బొనగాని భానుప్రియ ట్రిబ్ నిర్వహించిన పీజీటీ గణితం రాతపరీక్షకు హాజరయ్యారు.
దివ్యాంగ కోటా తుదిజాబితాలో ఎంపికైనట్టు ట్రిబ్ ప్రకటించింది. మల్టీజోన్-1లో సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ (బాలికలు)కి ట్రిబ్ అలాట్ చేసింది. ఫిబ్రవరి 15న ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్రెడ్డి నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ను సైతం ట్రిబ్ అందజేసింది. అక్కడి వరకు బాగానే ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా ఆ అభ్యర్థిని అధికారులు పక్కనపెట్టారు.
అక్కడ 68 శాతం.. ఇక్కడ 39 శాతం
40 శాతం వైకల్యం ఉన్న అభ్యర్థులే ప్రభు త్వ పథకాలు, ఉద్యోగాలకు అర్హులు అని గత ప్రభుత్వం నిర్ణయించింది. హియరింగ్ ఇంపైర్డ్తో ఉన్న భానుప్రియకు సదరంలో కరీంనగర్ జిల్లా వైద్యాధికారులు 68 శాతం మేర వినికిడిలోపం ఉన్నదని ధ్రువీకరించారు. ఉద్యోగానికి ఎంపికైన దివ్యాంగ అభ్యర్థులకు నిర్దేశిత వైకల్య పరీక్షలను సంబంధిత మెడికల్ బోర్డులతో ట్రిబ్ మరోసారి నిర్వహించింది.
అందులో భాగంగా భానుప్రియను కోఠిలోని ఈఎన్టీ మెడికల్ బోర్డులో పరీక్షలు నిర్వహిం చి.. 39 శాతమే వినికిడి లోపం ఉన్నదని తెలి పి, ఉద్యోగానికి అనర్హురాలు అని నిర్ధారించా రు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధికారులు ప్రస్తుతం పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఒక్కో చోట ఒక్కో తీరు వైకల్యాన్ని నిర్ధారించడం గమనార్హం.
అంతా ట్రిబ్ నిర్వాకం వల్లే..
దివ్యాంగ కోటా పోస్టుల భర్తీలో ఆయా పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రకటించి, అభ్యర్థులకు మెడికల్ బోర్డులతో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అందులో అర్హులైన వారితో ఆయా పోస్టులకు తుది జాబితాను ప్రకటించాలి. అదే ప్రకారంగా డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు అభ్యర్థులను ట్రిబ్ ఎంపిక చేసింది. కానీ పీజీటీ పోస్టులకు మాత్రం ఆ నిబంధనలను గాలికి వదిలేసింది. పీజీటీ పోస్టులకు 1:2 జాబితాను ప్రకటించింది.
ఆ అభ్యర్థులకు ట్రిబ్ అధికారులే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. మెడికల్ టెస్ట్ నిర్వహించకుండానే తుది జాబితాను ట్రిబ్ హడావుడిగా ప్రకటించారు. సొసైటీలకు అలాట్ చేశారు. అనంతరం పీజీటీ అభ్యర్థులకు మెడికల్ టెస్ట్లను నిర్వహించగా, ఆయా మెడికల్ బోర్డులు చాలామందికి వైకల్యం లేదని నిర్ధారించినట్టు తెలుస్తున్నది. దీంతో అపాయింట్మెంట్ అందుకున్న పీజీటీ దివ్యాంగ అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వటం లేదు. ఆ పోస్టులన్నీ మళ్లీ ఖాళీలుగా మిగిలిపోతున్నాయి. ట్రిబ్ నిర్వాకం వల్లే ఇదంతా అని దివ్యాంగ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.