హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మే డే సందర్భంగా ప్రత్యేక కానుకను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్వర్స్తోపాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ వేతన పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఈ పెంపుదల తక్షణమే అమలులోకి వస్తుందని చెప్పారు. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతి ఒక కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు.
త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించామని సీఎం తెలిపారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదని సీఎం కేసీఆర్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వారి కృషి దాగి ఉన్నదని అన్నారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలిచిందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారంటూ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకాలు చేయడంతో సంబంధిత జీవోలను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెంటనే విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీడీఎంఏ పరిధిలో ఇప్పటివరకు రెండు సార్లు వేతనాలు పెంచారు. 2016 ఫిబ్రవరి 19న రూ.8,300 ఉన్న వేతనాన్ని రూ.12 వేలకు పెంచారు. ఆ తరువాత 2022 జనవరి 6న రూ.12 వేల నుంచి రూ.15,600కు పెంచారు. తాజాగా మరో వెయ్యి పెంచడంతో వారి వేతనం రూ.16,600కు చేరింది. రాష్ట్రంలోని 29,804 మంది పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.49.47 కోట్లను వేతనాల రూపంలో చెల్లించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 25,613 మందికి రూ.17 వేలు ఉన్న వేతనాన్ని రూ.18 వేలకు పెంచారు.
తెలంగాణ ఏర్పడక ముందు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఒక్కో పంచాయతీలో ఒక్కోరకంగా ఉండేవి. జనాభా, క్యాడర్ అంటూ గందరగోళ విధానం ఉండేది. వీటన్నింటికీ స్వస్తి పలికి ఫుల్ టైం, పార్ట్ టైం వర్కర్లుగా వారిని విభజించి.. మంత్రి కేటీఆర్ వారికి వేర్వేరుగా వేతనాలు నిర్ణయించారు. పార్ట్ టైం వారికి రూ.4 వేలు, ఫుల్ టైం వారికి రూ.5 వేల చొప్పున ఖరారు చేశారు. ఆ తరువాత అందరికీ ఒకేరకమైన వేతనం ఇవ్వాలని, అందరినీ మల్టీపర్పస్ వర్కర్స్ అని పిలువాలని నిర్ణయించి, నెలకు రూ.8,500 వేతనం ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.1000 పెంపుతో వారి వేతనం రూ.9500కు చేరింది. గ్రామ పంచాయతీల్లో ప్రతి 500 జనాభాకు ఒక మల్టీపర్పస్ వర్కర్ ను నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఇద్దరు వర్కర్స్ ఉండాలని నిబంధన విధించారు.
కార్మికుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ మే డే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు వెయ్యి రూపాయల జీతం పెంచుతూ శుభవార్త చెప్పారని మంత్రి హరీశ్రావు అన్నారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్వర్క్స్తోపాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పనిచేస్తున్న మొత్తం 1,06,474 మందికి ఈ పెంపుతో లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రకటన మేరకు పారిశుద్ధ్య కార్మికులకు వేతన పెంపుపై ఆర్థిక శాఖ జీవో నంబర్ 39, 40లను విడుదల చేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కార్మికలోకం తరఫున సీఎంకు హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు.
మనసున్న మారాజు కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఐదు వందలు, వెయ్యి, నుంచి మొదలై చాలీచాలని జీతాలతో, కడుపు నింపుకోవడానికి కూడా కష్టపడిన పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రూ.8,500 వేతనం మొదలైందని చెప్పారు. ఇప్పుడు మరో రూ.1000 పెంపుతో నెలకు రూ.9,500లకు చేరాయని అన్నారు. సఫాయి కార్మికులకు కష్టానికి తగిన ఫలితమని, కార్మికులంటే సీఎం కేసీఆర్కు ఎనలేని గౌరవమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు.
సీఎంకు రవాణా మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు
టీఎస్ఆర్టీసీ సంస్థ అభివృద్ధే లక్ష్యంగా మరో ముందడుగు వేస్తూ త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు వారి జీతాలను పెంచుకుంటూ వారికి అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచాలని నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా కార్మికుల పక్షాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.