నల్లగొండ : అభూత కల్పనలు సృష్టిస్తూ.. కల్లి బొల్లి మాటలు, కట్టు కథలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టడమే ప్రతిపక్షాల పని అని ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ పట్టణంలో మంగళవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేస్తున్న రికార్డ్ తెలంగాణ రాష్ట్రానిదన్నారు. తెలంగాణ రాష్ట్రం 14.2 శాతం వృద్ధి రేటుతో ముందంజలో దూసుకుపోతున్నదన్నారు. 43 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. 60 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం అందజేస్తున్నట్లు చెప్పారు.
బీజేపీ,, కాంగ్రెస్ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ హబ్ను నల్లగొండలో కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సింగరేణి, ఆర్టీసీ సంస్థలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రం అన్ని సంస్థలను ప్రైవేటుకు కట్టబెడుతున్నది. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచి ప్రధాని మోడీ ప్రజలను దోచుకుంటున్నడు. తన 6 ఏళ్ల పదవీ కాలంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేసినట్లు తెలిపిన పల్లా మళ్ళీ ఒకసారి ఆశీర్వదించాల్సిందిగా గ్రాడ్యుయేట్స్ను వేడుకున్నారు.