హయత్నగర్, జూన్ 30 : చిట్టీల పేరిట బాధితుల వద్ద రూ.30 కోట్లు వసూలు చేసి ఓ చిట్టీల వ్యాపారి పరారైన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. సీఐ జీ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా, నార్కట్పల్లి మండలం, అమ్మనబోలు గ్రామానికి చెందిన చిట్టేటి మధుసూదన్రెడ్డి, కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చి హయత్నగర్లోని రాజరాజేశ్వరి కాలనీలో నివాసముంటున్నాడు.
మధుసూదన్రెడ్డి వృత్తిరీత్యా హయత్నగర్లోని ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. స్కూల్లో తోటి ఉపాధ్యాయులు, కాలనీలో చుట్టుపక్కల వారి వద్ద చిట్టీలు కట్టించుకొని దాదాపు రూ.30 కోట్ల వరకు వసూళ్లు చేశాడు. చివరికి బాధితులకు చిట్టీ డబ్బులు చెల్లించకుండా మధుసూదన్రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.