Cherlapalli Terminal | చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యాయని.. త్వరలోనే స్టేషన్ను ప్రారంభిస్తామని కేంద్ర రైల్వేశాఖ సహాయ రన్విత్ సింగ్ బిట్టు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.700కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనులు 2026 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకు 27శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. చర్లపల్లి స్టేషన్ పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే స్టేషన్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ స్టేషన్ పరిధిలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. నీటి సదుపాయం కల్పించేందుకు పెద్ద ఎత్తున ట్యాంకులను సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. కొత్త ప్లాట్ ఫామ్స్, లిఫ్ట్లు, వైయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలను సైతం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 119 రైల్వే స్టేషన్లను రూ.5వేలకోట్లతో అభివృద్ధి చేయాలని సూచించారన్న ఆయన.. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ని సైతం అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో వైపు రైళ్లలో జనరల్ బోగీలను సైతం పెంచనున్నట్లు తెలిపారు. దశల వారీగా జనరల్ బోగీలు పెంచి.. ప్రయాణిలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.