Watch Smuggling | మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనయుడు హర్షారెడ్డి బ్రాండెడ్ వాచులకు స్మంగ్లింగ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారులు హైదరాబాద్లోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరుగంటల పాటు తనిఖీలు చేపట్టిన అధికారులు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంత్రి తనయుడు హర్షారెడ్డి రూ.1.7కోట్ల విలువ వాచీల స్మగ్లింగ్లో పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రెండు ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వాచీలను మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
రెండు వాచీలు పాటెక్ ఫిలిప్-5740, బ్రెగ్యుట్- 2759 గుర్తించగా.. పాటెక్ ఫిలిప్ వాచ్ కంపెనీకి భారత్లో డీలర్లు లేరు. ఇక బ్రెగ్యుట్ కంపెనీ వాచీలు మార్కెట్లో స్టాక్ లేదు. వాచీలను పరిశీలించిన అధికారులు ధరను చూసి ఖంగుతిన్నారు. వాచీలను తరలిస్తున్న ముబీన్ను అరెస్టు చేసి విచారించారు. సదరు వ్యక్తి నవీన్ అనే వ్యక్తి కోసం వాటిని తీసుకువచ్చానని చెప్పాడు. దాంతో నవీన్ను విచారించగా.. పొంగులేటి తనయుడు హర్షార్డె పేరు బయటపడింది. హర్షారెడ్డి కోసం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఉండి.. ఆయా వాచీలను తెప్పిస్తున్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, హవాలా మార్గంలో వాచీల డబ్బులను చెల్లించినట్లుగా కస్టమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, వాచీల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (USDT)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత, హవాలా రూపంలో మరికొంత చెల్లించినట్లు తేలిందని కస్టమ్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ కేసులో హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. అదే నెల 3న కస్టమ్స్ అధికారులకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. తాను డెంగీ ఫీవర్తో బాధపడుతున్నానంటూ సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పాడు. అప్పటి నుంచి విచారణకు హాజరుకాకపోవడంతో అధికారులు హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు మూడుప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సోదాలపై అటు మంత్రి, ఇటు ఆయన తనయుడు స్పందించలేదు. అయితే, కస్టమ్స్ అధికారులకు సహకరించిన హైదరాబాద్ పోలీస్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ పరిణామాన్ని ధ్రువీకరించారు.