Dharani | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగడంపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.3 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు వెల్లడించారు. జూన్ 14న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించామని గుర్తుచేశారు.
రెండు వారాలు గడిచినా 21 వేల దరఖాస్తులే పరిష్కారమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ల స్థాయిలో 12 వేలు, అదనపు కలెక్టర్ల స్థాయిలో 20 వేలు,ఆర్డీవోల స్థాయి లో 53 వేలు, తాసీల్దార్ల స్థాయిలో 1.4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్డీవోలు, తాసీల్దార్లతో నవీన్ మిట్టల్ నేరుగా మాట్లాడి.. ఎందుకు ఆలస్యం అవుతున్నదో ఆరా తీశారు. ధరణి సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. త్వరలో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, ఆలోగా పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని నవీన్ మిట్టల్ స్పష్టం చేసినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసీల్దార్లు కూడా పాల్గొన్నారు.