Cantonment | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్29 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనానికి మార్గం సుగమమైంది. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలితం దక్కింది. ఈనెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో వీడియో కాన్ఫరెన్స్లో అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ విలీనానికి అంగీకరించడంతో రక్షణ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ సదరన్ కమాండ్ హేమంత్ యాదవ్ కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రకారం కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్ధేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవాలని రక్షణశాఖ బోర్డు అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం పేరిట ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు బాధ్యుల సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం సూచించింది.
కొత్త చట్టాలపై ‘సమాహార’ యాప్
రూపొందించిన ప్రాసిక్యూషన్ విభాగం
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై సమగ్ర సమాచారంతో తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం ప్రత్యేకంగా ‘సమాహార’ పేరిట యాప్ను రూపొందించింది. దీంతోపాటుగా ప్రత్యేకంగా ఓ హ్యాండ్ బుక్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటిని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా జితేందర్ ఆవిష్కరించి, ప్రాసిక్యూషన్ టీమ్ను అభినందించారు. కొత్త చట్టాల్లోని పలు సెక్షన్లకు సంక్షిప్త వివరణలు, పోలిక పట్టికలు, రెడీ రిఫరెన్సులు, మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా సామాన్యులకు సైతం సులువుగా అర్థమవుతాయని తెలిపా రు. కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులకు కరదీపిక గా పని చేస్తుందని చెప్పారు.
త్వరలో నాలుగో రైల్వే లైన్
ఎస్సీఆర్ ప్రధాన మార్గాల్లో నిర్మాణానికి కసరత్తు
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్ పరిధిలోని ప్రధాన మా ర్గాల్లో కొత్తగా నాలుగో లైన్ను నిర్మించాలని రైల్వేశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులు, సరుకు రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాలుగో లైన్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కొ న్ని మార్గాల్లో సర్వే పనులు కూడా ప్రా రంభించినట్టు సమాచారం. ప్రస్తుతం కాజీపేట-విజయవాడ, కాజీపేట-బలార్ష సెక్షన్లలో మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాకే నాలుగో లైన్ పనులు ప్రారంభించనున్నారు.
ఇందుకు సంబంధించిన డీపీఆర్లను త్వరలోనే రైల్వేశాఖకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో నాలుగో లైన్ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ప్రయాణికుల సంక్షే మం కంటే పారిశ్రామిక ప్రయోజనాల కోసం అదనపు రైల్వే మార్గాల నిర్మాణా న్ని చేపడుతున్నదని రైల్వే ఉద్యోగ సం ఘాల ప్రతినిధులు అంటున్నారు. అధిక ఆదాయం వచ్చే వందే భారత్ రైళ్లపై ఉన్న ప్రేమ ‘పేదోడి బండి’గా చెప్పుకునే ప్యాసింజర్ రైళ్లపై చూపడం లేదని విమర్శిస్తున్నారు.