CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గురువారం ముహూ ర్తం కూడా పెట్టుకున్న పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ రెండు ప్రక్రియలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పార్టీ పెద్దలు ప్రకటించారు. వీటిపై పునఃసమీక్షిద్దామని రేవంత్రెడ్డి పట్టుబట్టినప్పటికీ, అవకాశం ఇవ్వకుండా, తొందరేముంది అంటూ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకకు, కేసీ వేణుగోపాల్ కేరళకు వెళ్లిపోయారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి నిరాశతో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన పేర్లపై మంత్రులు, సీనియర్ నేతలు వ్యక్తపరిచిన అభ్యంతరాలతో పార్టీ పెద్దలు పూర్తిగా ఏకీభవించడమే వాయిదాకు కారణమని చెబుతున్నారు.
బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి సాయంత్రం రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుతో కలిసి మల్లికార్జున్ఖర్గే ఇంటికి వెళ్లారు. కేశవరావు అధికారికంగా కాంగ్రెస్లో చేరిన ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, రాష్ట్ర ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. అనంతరం వారంతా ఖర్గే ఇంట్లోనే సమావేశమై మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుని ఎంపికపై చర్చించినట్టు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణకు రేవంత్రెడ్డి చేసిన ప్రతిపాదనతో పార్టీ పెద్దలు విభేదించినట్టు తెలిసింది. పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మళ్లీ కసరత్తు చేశాకనే మంత్రివర్గాన్ని విస్తరిద్దామని చెప్పి ప్రస్తుతానికి వాయిదా వేద్దామని ప్రకటించినట్టు తెలిసింది.
రేవంత్ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించారు?
మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుని ఎంపికపై జూన్ చివరి వారంలో సీఎం రేవంత్రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, దీపాదాస్ మున్షీతో విస్తృతంగా చర్చించారు. ఐదు రోజులపాటు వీరంతా ఢిల్లీలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం విడిగా కసరత్తు చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదనలపై సీనియర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు సహేతకంగా ఉన్నాయని అధిష్ఠానం భావించినట్టు సమాచారం. తమ అభిప్రాయాలను అధిష్ఠానం ముందే తీసుకోవడంతో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అన్న అంచనాతో సీఎం రేవంత్రెడ్డి గురువారం ముహూర్తం ఖరారు చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి సమాచారం కూడా ఇచ్చారు.
సీనియర్ల అభ్యంతరం ఏమిటి?
మంత్రివర్గ విస్తరణపై తమతో చర్చించకుండానే సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగా అధిష్ఠానం ముందు ప్రతిపాదన పెట్టారని సీనియర్ నేతలు, మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వారు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో మొదట ఈ నాలుగు జిల్లాలకు అవకాశం కల్పించాలని సీనియర్లతోపాటు అధిష్ఠానం కూడా భావించినట్టు తెలిసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. అయినప్పటికీ ఇదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేరును ప్రతిపాదించడాన్ని ఉత్తమ్కుమార్రెడ్డి వ్యతిరేకించినట్టు తెలిసింది.
కోమటిరెడ్డి కుటుంబానికే రెండు మంత్రి పదవులు ఇచ్చే పక్షంలో తన భార్య పద్మావతికి కూడా ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలిసింది. అలాగే ఆదిలాబాద్ నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్సాగర్రావుకు కాకుండా రేవంత్రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరును ప్రతిపాదించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్టు చెప్తున్నారు. దివంగత జీ వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్కు ఎమ్మెల్యేలుగా, ఆయన మనవడు వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పించి మంత్రి పదవి కూడా వారి కుటుంబానికి ఇవ్వాలని రేవంత్రెడ్డి ప్రతిపాదించడాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. తాను భట్టి వర్గీయుడనే కారణంగానే మంత్రి పదవి ఇవ్వకుండా సీఎం అడ్డుపడుతున్నట్టు ప్రేమ్సాగర్రావు తన సన్నిహితుల వద్ద వాపోయారు. ఈ విషయాన్ని కూడా సీనియర్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
సీఎం పదవికి ఒప్పుకున్నామని& !
మరోవైపు హైదరాబాద్ నగరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అయితే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీగణేశ్ గెలుపొందినప్పటికీ ఆయనకు కాకుండా ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన దానం నాగేందర్ పేరును సీఎం ప్రతిపాదించడాన్ని కూడా సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. ఇలా ఉండగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని కూడా సీనియర్లు అధిష్ఠానం వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది.
రేవంత్రెడ్డికి సీఎం పదవి ఇస్తామంటే అంగీకరించామని, కానీ నిర్ణయాలు తీసుకొనే అన్ని అధికారాలు ఆయనకే అప్పగిస్తే ఊరుకొనేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనికితోడు మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు కూడా మారనున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ బాంబు పేల్చారు. సీనియర్లకు డమ్మీ శాఖలు కట్టబెట్టి మొదటిసారి మంత్రి అయిన సీతక్కకు హోం శాఖ ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్రెడ్డి ఏకపక్ష, ఒంటెద్దు పొకడలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే అదిష్ఠానం దీనిని వాయిదా వేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.