BV Raghavulu | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్బోర్డు చట్టాన్ని సవరించి మార్పులు చేయాలనుకోవడం అభ్యంతరకరమని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిస్తున్నాననే స్పృహ లేకుండా ప్రధాని మోదీ దూకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మతతత్వ ఆలోచనలను విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రసంగించడమే అందుకు నిదర్శనమన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం, శనివారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని హైదరాబాద్లోని ఎంబీ భవన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక మతంలో ఇంకో మతస్తులుండొద్దంటూ బీజేపీ నేతలు చెప్తారని గుర్తు చేశారు. వక్ఫ్బోర్డులో మాత్రం ఇతర మతస్తులను చేర్చి నియంత్రించాలని చెప్తున్నారని అన్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలేంటని ప్రశ్నించారు. దయాదాక్షిణ్యాలతో ఇచ్చిన భూములను నియంత్రించడమే వక్ఫ్బోర్డు పని అని చెప్పారు. వాటి మీద ప్రభుత్వం నియంత్రించడానికి పూనుకోవడం న్యాయం కాదన్నారు. అవినీతిపై ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని అన్నారు. హర్యానా, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతున్నాయనీ, దుర్బుద్ధితో మత విభజనను సృష్టించి ఓట్లు పొందాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. యూనిఫామ్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్లో లోపాలుంటే సవరించుకోవచ్చనీ, దాన్ని కమ్యూనల్ సివిల్ కోడ్గా మారుపేరు పెట్టారని ప్రధాని మోదీ మత దురభిప్రాయాన్ని రెచ్చగొడుతున్నారని రాఘవులు చెప్పారు.
కింది స్థాయి వ్యక్తులు వ్యాఖ్యలు అర్థం చేసుకోవచ్చనీ, ఇది ప్రధాని హోదాకు తగదని అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన వ్యక్తి చీలిక తెస్తున్నారని విమర్శించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను మారుస్తామంటున్నారని, ఉత్తరాఖండ్లో మార్చారనీ, అనేక పరిణామాలు జరిగాయని వివరించారు. అన్ని మతాల్లో పురుషాధిక్యత కొనసాగుతున్నదనీ, దాన్ని తగ్గించాలని కోరారు. వివిధ మతాల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే మహిళలు, మైనార్టీలకు మేలు జరగబోదని అన్నారు. స్వార్థపూరిత, ఓట్ల రాజకీయాల కోసం వాడుకోవడాన్ని తీవ్రంగా వ్యవరేకిస్తున్నామని చెప్పారు.