మహబూబ్నగర్ : అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి ఏర్పడుతున్నది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు హామీల అమలు కోసం రోడ్లు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా పాలమూరు వర్సిటీలో విద్యార్థులు నిరసనకు దిగారు. గద్దెనెక్కిన వెంటనే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్(Job calendar )ప్రకటించి వంద రోజుల్లోనే నెరవే రస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా ఇవ్వడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం (Palamuru University) ప్రధాన ముఖద్వారం వద్ద బీఆర్ఎస్వీ(BRSV leaders) ఆధ్వర్యంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్బాబు మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని ధ్వజమెత్తారు.
గ్రూప్-1, మెయిన్స్కు 1:100 ప్రకారం ఎంపిక చేయాలని, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3 వేల పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి కేవలం 12 వేల పోస్టులతో బిచ్చం వేసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదన్నారు. ఉస్మానియా జేఏసీ నేత మోతిలాల్ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి దవాఖానకు వెళ్లి మోతిలాల్ చేపట్టిన దీక్షను విరమింప జేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.