KTR | జగిత్యాల : రాజకీయాల్లో హత్యాలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేను, కవిత వచ్చి గల్లీ గల్లీలో తిరిగి మన అభ్యర్ధులను గెలిపించుకొని సంజయ్ను జగిత్యాల నుండి తరిమికొడుదాం అని ఆయన పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రైతుభరోసా, రుణమాఫీ, పెన్షన్లు, కరెంట్ రాదని అర్థమైంది. ఎరువులు వినత్తలు లేవు. పట్టణాభివృద్ధి ఆగిపోయింది. కానీ నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ది కోసం అంటున్నారు.. మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది. పెట్టుబడులు ఆగిపోయాయి. కాంగ్రెస్ రాజకీయాలను విద్యార్థులు, ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లా ఎగిరేది గులాబీ జెండానే. మనం భయపడొద్దు. కేసీఆర్ అండగా ఉన్నారు. మన పనులు ప్రజల కళ్ల ముందున్నాయి. చరిత్రను చెరిపిస్తే చెరిగిపోదు. జగిత్యాలను జిల్లా చేసింది కేసీఆర్. ఒక్కడు పోయిండు అని భయపడొద్దు. ఎంగిలి మెతుకుల కోసం కొందరు పోతే పోనీ భయపడొద్దు.. ప్రజలే తీర్పు చెబుతారు అని కేటీఆర్ చెప్పారు.
మీకు మేమందరం అండగా ఉంటాం. మీ సమస్యలపై మండలిలో ఎల్ రమణ, అసెంబ్లీలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గళం విప్పుతారు. జగిత్యాలలో సంజయ్ మనషులకు ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ సీటు కూడా ఇవ్వనివ్వడు జీవన్ రెడ్డి. సంజయ్తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు. కాంగ్రెస్ పార్టీలో సంజయ్కు భవిష్యత్ లేదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు ఉంటాయి. జగిత్యాల ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుండు. లోకల్ బాడీ ఎన్నికల్లో అండగా ఉంటాం. గల్లీ గల్లీ తిరుగతా.. కవితక్క కూడా వస్తది.. తప్పకుండా తిరుగుతది.. మీకు అండగా ఉంటాం. డాక్టర్ సంజయ్ను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.