KTR | జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా తిరిగి కేసీఆర్ నాయకత్వంలో విజృంభిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చిన హామీలు, మాటలు చెప్పారు. రుణమాఫీ లేదు. నాలుగు వేలు పెన్షన్లు లేవు. ఆడబిడ్డలందరికీ నెలకు రూ. 2500, క్వింటాల్కు రూ. 500 బోనస్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, మెనార్టీలకు 20 వేల కోట్లు ఖర్చు చేస్తానని 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.
గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. నిజమైన గులాబీ దండు ఎక్కడికి పోదు.. తప్పకుండా తిరిగి కేసీఆర్ నాయకత్వంలో విజృంభిస్తాం. తాత్కాలికంగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. రెండుసార్లు ఎవరి పొత్తు, మద్దతు అవసరం లేదకుండా 2014లో 63, 2018లో 88, 2023లో కూడా మూడో వంతు సీట్లు అంటే 39 స్థానాలు గెలిచాం. 14 సీట్లలో కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయాం అని కేటీఆర్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మోదీ మీదనే ఎన్నికలు జరిగాయి. దీంతో సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. మోదీని వద్దనుకున్న వారు ఇండియా కూటమికి, కావాలనుకున్న వారికి ఎన్డీఏకు ఓటేశారు. ఏ కూటమిలోలేని వారికి కొంత ఇబ్బంది కలిగింది. కేరళలో సీపీఎం ఉంది. ఏ కూటమిలో లేదు.. స్వతంత్రంగా మనలాగా పోటీ చేసింది.. 20లో ఒకటి గెలిచింది. ఏపీలో జగన్ , తెలంగాణలో మనం ఓడిపోయాం. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సీఎంగా ఉండి కొట్లాడితే ఒక సీటు వచ్చింది. యూపీలో బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాలేదు. పంజాబ్లో అకాలీదళ్కు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు.. బీజేడీ, అకాలీదళ్, బీఎస్పీ, సీపీఎం, వైఎస్సార్సీపీతో పాటు మనకు ఎదురుదెబ్బ తగిలింది అని కేటీఆర్ పేర్కొన్నారు.