KTR | హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వెనుకాల గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. మొత్తానికి ఆ ప్రాజెక్టు ట్రయల్ రన్ను గురువారం నిర్వహించగా, విజయవంతమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజు ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు తన గుండెకాయ అని కేసీఆర్ గతంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కరువును శాశ్వతంగా పారదోలే వరప్రదాయినికి కేసీఆర్ జీవం పోశారని కొనియాడారు. సీతారామ ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించి, పటిష్ఠ ప్రణాళికను తయారు చేసి యుద్ధ ప్రతిపాదికన అమలు చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లోని.. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఇక ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదు.. దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాలమైనా.. కాకపోయినా.. పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో.. ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు రానున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ కలను సాకారం చేసి.. ఈ “జలవిజయం”లో భాగస్వాములైన.. నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అభినందనలు.. కష్టపడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. జై తెలంగాణ.. జై సీతారామ ప్రాజెక్టు అంటూ కేటీఆర్ తన ట్వీట్ను ముగించారు.
మరో స్వప్నం సాకారమైన క్షణమిది..
కేసిఆర్ గారి మహాసంకల్పం నెరవేరిన రోజిది..“సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని..
ఆనాడే ప్రకటించారు నాటి సీఎం కేసిఆర్ గారు..ఖమ్మం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే..
వరప్రదాయినికి ప్రాణం పోశారు.. కేసిఆర్ గారుప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు… pic.twitter.com/lPH6Gu7zWa
— KTR (@KTRBRS) June 27, 2024