BRS | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): సింగరేణిని ప్రైవేటీకరించేందుకే బొగ్గు గనులను వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగామని, కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి రాగానే వేలం వేశాయని చెప్పారు. సింగరేణికి ఎప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుందామని, పోరాటాలకు అండగా ఉంటామని ప్రకటించారు. గురువారం తెలంగాణభవన్లో ఆయనతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు, సింగరేణి ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. కేంద్రంతో సీఎం రేవంత్ కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాలు చూపి పెట్టుబడులను ఉపసంహరించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలతో కేసీఆర్ ఉద్యమ కాలం నుంచే పనిచేస్తున్నారని, సకల జనుల సమ్మెలో సింగరేణి ప్రాధాన్యాన్ని దేశం గుర్తించిందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల బలోపేతం అనేది బీఆర్ఎస్ విధానమని వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి బొగ్గు గనులను వేలంకు పెట్టాయని ధ్వజమెత్తారు.
సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, హరిప్రియ నాయక్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోని ప్రతి బొగ్గు పెల్ల సింగరేణిదేనని, వేరే ఎవరైనా వస్తే ఉరుకునేది లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. చిన్న బొగ్గు పెల్లను కూడా తీయనీయబోమని, వేలానికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. తెలంగాణభవన్లో కేటీఆర్తో సమావేశానంతరం మీడియాతో మాట్లాడు తూ.. బొగ్గుగనుల వేలానికి వ్యతిరేకంగా జూలై 1 నుంచి ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల తవ్వకానికి ప్రైవేటు కంపెనీలు వస్తే సహించబోమని తేల్చిచెప్పారు.
బీజేపీ వైఖరి, కాంగ్రెస్ విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వేలం పాటలో కిషన్రెడ్డి, భట్టి విక్రమార్క నవ్వుతూ మాట్లాడుకున్నారని ఫైర్ అయ్యారు. నామినేషన్ విధానంలో సింగరేణికి బొగ్గు గనులు ఇవొచ్చన్న విషయాన్ని గుర్తించాలని తెలిపారు. బొగ్గు గనులను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కలుస్తామని, బొగ్గు గనులను సింగరేణికే ఇచ్చేలా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసేలా ఒత్తిడి తీసుకొస్తామని వెల్లడించారు. ఇందిరాపార్కు వద్ద, వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామ్మూర్తి, కే సురేందర్రెడ్డి, లక్ష్మణ్, శంకర్, జాఫర్ హూస్సేన్ పాల్గొన్నారు.