KTR | హైదరాబాద్ : లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ తెలిపారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. భసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పనిచేస్తున్నారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించింది. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమైనయ్. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయి. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పని చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది మన పార్టీ విధానం. ఉద్యమ కాలం నుంచి…ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే మా విధానం. అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చిన పక్కకు పెట్టి… రైతు బీమాను ఎల్ఐసీ ఇచ్చాం. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్ఈఎల్కి అప్పగించాం అని కేటీఆర్ గుర్తు చేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ.. తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నాం అని కేటీఆర్ గుర్తు చేశారు.
కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం… గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయి. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలో ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయి. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి… సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.