KTR | సీఎం రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులంటే అసలే గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని శుక్రవారం టీజీపీఎస్సీ వద్ద ఆందోళనకు దిగిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో స్పందించిన కేటీఆర్.. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది అని ఆయన తన `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` ఖాతాలో పోస్టు చేశారు.
ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెల్ల దొరల పాలన కన్నా దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా ? అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా ? అని ప్రశ్నించారు.
ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన అని కేటీఆర్ అభివర్ణించారు. ప్రచారంలో ఒక మాట..ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సీఎం రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడంలోనూ, జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు.. వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయం అని స్పష్టం చేశారు. `జై తెలంగాణ` అంటూ ట్వీట్ ముగించారు.