KTR | జగిత్యాల : పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా… ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నిజంగా రోషం, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం కదా అని కొందరు అంటున్నారు. మనకు వాళ్లకు తేడా ఏందో తెలవాలి. పార్టీ ఫిరాయింపులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం.. గయారాం.. విషబీజానికి మొగ్గ తొడిగింది ఇందిరా గాంధీ. హర్యానాలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను గుంజుకున్నది.. ఇందిరా గాంధీ. అలా పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ గుర్తు చేశారు.
2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నుంచి 26 మంది గెలిస్తే.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే ప్రయత్నం చేశారు. 2014లో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 2014 తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయిండు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది మన పార్టీలో విలీనం అయ్యారు రాజ్యాంగబద్ధంగా. మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు కలిసి బీఆర్ఎస్లో విలీనం అయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే.. 12 మంది చేరారు. రాజ్యాంగబద్దంగా మూడింట రెండొంతుల మంది చేరారు. ఒక్కొక్కరు వచ్చి కండువా కప్పుకోలేదు. ఆ పని కేసీఆర్ చేయలేదు అని కేటీఆర్ వివరించారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను కుక్కల మాదిరి రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరు పిచ్చికుక్క.. ఎవర్నీ రాళ్లతో కొట్టిచంపాలి. మీ చెమట, మీ రక్తం ధారపోసి గెలిపించాక పార్టీ ఫిరాయింపులు చేస్తే అలాంటి వారిని రాళ్లతో కొట్టిచంపమని రేవంత్ రెడ్డే చెప్పిండు. మరి ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..? ఎవర్నీ రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు కానీ.. రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.. ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని రాజకీయంగా శ్వాశతంగా సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒక్క రేవంత్ రెడ్డే కాదు.. అందరూ మాట్లాడారు.. రాహుల్ గాంధీ కూడా చాలా మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్ క్వాలిఫికేషన్ చేస్తా అని రాహుల్ తుక్కుగూడలో నరికిండు. మేనిఫెస్టోలో పెట్టుడు కాకుండా పాంచ్ న్యాయ్ అనే దాంట్లో కూడా పెట్టారు రాహుల్ గాంధీ. ఇక జీవన్ రెడ్డి కూడా ఆగమైండు.. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారొద్దని మేం మేనిఫెస్టోలో పెట్టామని జీవన్ రెడ్డి చెప్పిండు. ఇక ఇప్పుడు జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఓట్లకు వస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి అని కేటీఆర్ చెప్పారు.