KTR | జగిత్యాల : గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
జగిత్యాలకు పట్టిన శని పోయిందని ఈ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తది. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే. గడ్డిపారల్లాంటి మీరు వెళ్లలేదు.. ఒక గడ్డిపోచ మాత్రమే కొట్టుకుపోయింది అని ఎమ్మెల్యే సంజయ్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కవితక్కతో సహా వేల మంది కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దొంగల్లో కలిసిండు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చింది. అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్. ఆయన పోయింది ఒక్కదాని కోసం.. ఇయ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జిగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.