KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉరి వేసుకుని పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆత్మ హత్య చేసుకోవడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణమృదంగం మోగుతోందని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని, మళ్లీ సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం తలెత్తిందని కొద్ది రోజుల క్రితం కేటీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఈ ఏడాది జూన్ 24వ తేదీన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.