KTR | హైదరాబాద్ : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పైన పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పైన ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయడం సరికాదన్నారు.
స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపినందుకు.. పోలీసులు ఎమ్మెల్యే పైనే ఏకపక్షంగా కేసు నమోదు చేయడం అక్రమం అన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని కేటీఆర్ తెలిపారు.
కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరింది. ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలకు దిగారు. రాస్తారోకోలు చేపట్టారు. అయితే విశ్వప్రసాద్ రావు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.