BRS leader KTR : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన చైర్మన్గా నియమితులవుతున్న తెలంగాణ బిడ్డ శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి (CS Shetty) కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన చైర్మన్గా నియమితులవుతున్న తెలంగాణ బిడ్డ శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి (CS Shetty) గారికి హార్ధిక శుభాకాంక్షలు’ అని కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ప్రసుత్తం ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పాలమూరు బిడ్డ సీఎస్ శెట్టిని చైర్మన్గా ఆర్థిక సేవల సంస్థల బ్యూరో (FSIB) సిఫారసు చేసింది. ప్రస్తుతం చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న దినేశ్ కుమార్ ఖారా ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో నూతన వ్యక్తిని నియమించడానికి FSIB పలువురు సీనియర్ ఉన్నతాధికారులను శనివారం ఇంటర్వ్యూ చేసింది.
ఇంటర్వ్యూలో పాల్గొన్న వారిలో శెట్టి కూడా ఒకరు. బ్యాంకులో ఆయన పనితీరు, అనుభవం, ప్రస్తుత పరిమితులను దృష్టిలో పెట్టుకొని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫారస్ చేసినట్లు FSIB ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ACC)’ సమావేశమై FSIB సూచించిన వ్యక్తిపై తుది నిర్ణయం తీసుకోనున్నది.
జనవరి 2020లో బ్యాంక్ ఎండీగా నియమితులైన శెట్టి.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ వర్టికల్లో విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను శెట్టి బేసిక్ వేతనం కింద రూ.26.3 లక్షలు, డీఏ కింద మరో రూ.9.7 లక్షలు అందుకున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు ఫోర్స్/కమిటీలకు ఆయన సారథ్యం వహించారు.
శెట్టి జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు గ్రామంలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆపై గద్వాలలో ఉన్నత చదువులు చదివారు. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి బీఏ అగ్రికల్చర్లో పట్టా పొందారు. ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయిలో కెరియర్ ప్రారంభించిన శెట్టి.. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు.