హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ దవాఖానలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్నాయక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించింది. గురువారం ఆయనను బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ దవాఖానలో కలిసి పరామర్శించారు. తన దీక్షకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని మోతీలాల్కు భరోసా ఇచ్చారు.
మరోవైపు, నిరుద్యోగుల ఉద్యమాలకు రాష్ట్రంలో పలు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తున్నది. గురువారం నల్లగొండ జిల్లాలోని సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు ధర్నాలు చేశారు. హైదరాబాద్లో టీజీపీఎస్సీ ముట్టడి, గాంధీభవన్ వద్ద, దిల్సుఖ్నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీలో ధర్నాలు నిర్వహించారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేకపోవటంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. తమ డిమాండ్లు సాధించుకొనేంత వరకు ఉద్యమాలు విరమించే ప్రసక్తే లేదని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు.