BRS chief KCR : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదని, మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చిపిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని, విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని కేసీఆర్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతోపాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కాని నాయకులు పార్టీని సృష్టించరని, మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ‘నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా..?’ అని ప్రజలే అసహ్యించుకుంటున్నారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని.. అలా కాకుండా కొందరు కేసీఆర్ ఆనవాళ్లను చెడిపేస్తామంటున్నారని, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దాన్నే చెడిపేస్తరా అని ఆయన ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వచ్చినంక గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చే నాటికి చెట్టుకొకడు పుట్టకొకడు అయ్యిండనే బాధతో వ్యవసాయాన్ని స్థిరీకరణ చెయ్యాలని రైతుబంధు పథకాన్ని అద్భుతంగా రైతులందరికీ అందించామన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రకరకాల కారణాలతో అసలు ఆ పథకానికే ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు ఏడాది పొడవునా పంటలను సాగు చేస్తూనే ఉంటారని, సాగు లెక్కలు ఇతరత్రా కారణాలు చూపుతూ రైతుబంధును అమలు చేస్తే అవినీతి మొదలైతదని అన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కొంచెం సమన్వయంతో ఓపిక పట్టాలని కోరారు.
మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని కేసీఆర్ అన్నారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉన్నదని, ఈసారి బీఆర్ఎస్ తరపున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామన్నారు. బంగ్లాదేశ్లో హష్మీ అనే ఒక ప్రొఫెసర్ పేద మహిళల కోసం 71 వేల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న విధానం గురించి, జీరో పొల్యూషన్ నగరాల్లో అక్కడి మేయర్లు ప్రజల్లో మమేకమైన విధానం గురించి కేసీఆర్ వివరించారు.