Balka Suman | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
ఏ పార్టీ, ఏ సంఘం, ఎవరి మద్దతు లేకుండా.. సంఘటితంగా సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటం గొప్ప పోరాటం. మోతీలాల్ అనే నిరుద్యోగి 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. యూనివర్సిటీల్లో ఆందోళనలు చేశారు. జిల్లాల్లో ర్యాలీలు నిరసనలు చేపట్టారు. నిరుద్యోగుల తెగువకు, తెగింపునకు, వారి పోరాట పటిమకు హ్యాట్సాఫ్ చెబుతున్నాని బాల్క సుమన్ పేర్కొన్నారు.
నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడుతాం. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నిరుద్యుగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా వెంటబడుతాం అని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగుల ఆందోళనల్లో ముందున్న ఆకునూరి మురళి, కోదండరాం ఎక్కడున్నారని నిరుద్యోగులే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మీకు ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ను ప్రశ్నించడం లేదా..? అని బాల్క సుమన్ నిలదీశారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఒక లక్షా 88 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రయివేటు రంగంలో కూడా 24 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో కలిపి మొత్తం 26 లక్షల ఉద్యోగాల కల్పన కేసీర్ నాయకత్వంలో జరిగింది. టీఎస్పీఎస్సీలో కొద్ది మంది వల్ల తప్పులు జరిగి ఉండొచ్చు. కోర్టు కేసుల కారణంగా అనుకున్నంత వేగంగా సకాలంలో ఉద్యోగాల భర్తీ జరగకపోవచ్చు. చేసినంత వరకు చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేశాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే వారి ఉసురు తగులతది రేవంత్ రెడ్డికి. క్షేత్రస్థాయిలో నిరుద్యోగుల పోరాటాలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివస్తదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని బాల్క సుమన్ భరోసానిచ్చారు.