KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు మూడు రోజుల పాటు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆత్మీయ సమావేశాల పునఃప్రారంభ వివరాలను, ఏ నియోజకవర్గాల వారు ఎప్పుడు రావాలనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే గత రెండు వారాలుగానియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, నేతలను భేటీ అవుతున్నారు. తనను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వస్తున్న ప్రజలతో ఓపికగా కలుస్తున్నారు. గంటల పాటు నిలబడి వారిని కేసీఆర్ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో ఫొటోలు దిగుతున్నారు. గత 15 రోజుల్లో దాదాపు 50 వేలకు పైగా ప్రజలు తమ అభిమాన నేతను కలిసి తమ ఆనందాన్ని, కష్టసుఖాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? అని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని తెలిపారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్దన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.