హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగ ప్రతిపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని, దే శ ప్రజలకు సేవ చేస్తామని చెప్తూనే రా జ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పెద్దలు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.
మహారాష్ట్ర. మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్తోపాటు తాజాగా తెలంగాణలో ఇలాగే చేర్చుకున్నారని ఆక్షేపించారు. ఇలాంటి రా జ్యాంగ ఉల్లంఘనలపై పార్లమెంట్ కఠినం గా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం ఆయన రాజ్యసభలో ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని, కొత్త ఆశలు లేవు, ఆశయాలు కూడా ఏమీ కనిపించలేవని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో ఫెడరల్ స్ఫూర్తి లోపించిందని, రాష్ర్టాల సహకారంతో దేశాన్ని నడిపామని ఎక్కడా చెప్పలేదని ఆక్షేపించారు. గత ప్రసంగంలో కూడా రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పారని కానీ, డబుల్ కాలేదని తెలిపారు. దేశంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం, సంకీర్ణ ప్రతిపక్షం ఏర్పడిందని చెప్పారు. తాము రెండు కూటములకు దూరంగా ఉంటామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి సూచనలు చేస్తామని, ప్రజలకు అన్యా యం జరిగితే మాత్రం ఊరుకొనే ప్రసక్తే ఉండదని స్పష్టంచేశారు. వెనుకబడిన తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులపై చట్టసభల్లో పోరాడుతామని చెప్పారు.
ప్రాంతీయ పార్టీల గొంతునులిమేయత్నం
ప్రజల ప్రయోజనాలు, సెంటిమెంట్, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు ఏర్పడతాయని సురేశ్రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల గొంతు నులిమే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. రాజ్యంగాన్ని కాపాడుతాం అంటూనే.. రాజ్యాంఘాన్ని ఉల్లంఘిస్తున్నారని, తెలంగాణ వాయిస్ను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ర్టాలకు కేంద్రం నుంచి ఆశించిన సహకారం రావడం లేదని పేర్కొన్నారు.