MLC Tata Madhu | హైదరాబాద్ : ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను.. ఆ పార్టీకి ఓటేశాను అని మరణ వాంగ్మూలం ఇస్తే.. అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడానికి సిగ్గు లేదా అని కాంగ్రెస్ నాయకుడు కోదండ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో తాత మధు మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలవులున్నా పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ టు ఢిల్లీకి గాలిలో చక్కర్లు కొడుతున్నారు. ప్రజల బాధలు పట్టించుకునే నాధుడు లేడు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వర్షాల్లేక విత్తనాలు మొలకెత్తని పరిస్థితి. భూమి యాజమాన్యపు హక్కుల కోసం కాళ్లు అరిగేదాకా తిరిగినా పట్టించుకోవడం లేదు. అనేక ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ ఆరు నెలలో రైతుల బాధలు వర్ణాతీతం. రైతు ధర్నా చేశాడు.. ఎమ్మార్వోను నిలదీశాడు.. కలెక్టరేట్ ముందు నిరసన చేశాడని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆత్మహత్యాయత్నం చేశాడని ప్రతి రోజు ఏదో ఒక పేపర్, ఒక చానల్లో వార్తలు వస్తున్నాయని మధు తెలిపారు.
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జూన్ మాసంలో పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించేవాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పారు. రైతులను మోసం చేసి కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు రూ. 10 వేలకు కూడా ఎగనామం పెట్టారు. జులై వచ్చింది కానీ రైతుబంధు ఖాతాల్లో పడలేదు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకు ఉన్న 7 ఎకరాల 10 గుంటల భూమిని ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేసి కబ్జా చేశారు అని ఎమ్మెల్సీ గుర్తు చేశారు.
రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై ధరణి కమిటీ చైర్మన్గా ఉన్న కోదండ రెడ్డి మాట్లాడుతూ.. అది బీఆర్ఎస్ పార్టీ పన్నిన కుట్ర అని సిగ్గుమాలిన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయనకు బుద్ధి మందగించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ కూరపాటి శిరీష భర్త కిశోర్ నా ఆత్మహత్యకు కారణం అని ప్రభాకర్ మరణ వాంగ్మూలంలో చెప్పారు. కిశోర్ భట్టివిక్రమార్క అనుచరుడు. శిరీష చింతకాని మాజీ జడ్పీటీసీ. కొత్త ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డితో ఫొటో దిగారు. ప్రభాకర్ కేసులో ఏ1గా ఉన్న కిశోర్ను ఏ8గా మార్చారు. ఏ8గా ఎందుకు మార్చారో పోలీసులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి అని తాత మధు డిమాండ్ చేశారు.
పోలీసులు ఈ కేసులు డైవర్షన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్న పుల్లయ్యను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదు. పోలీసులు కావాలని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రైతు చనిపోతే సానుభూతి చూపించకుండా రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతు ప్రభాకర్ చనిపోయినందుకు, ఆయనపై జాలి, దయ ఉంటే.. హరీశ్రావు డిమాండ్ మేరకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, ప్రభాకర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి. ఇవాళ ప్రశ్నించే గొంతుకలు మూగబోయాయి. కోదండరాం, తీన్మార్ మల్లన్న ఎక్కడ పోయారు అని తాత మధు ప్రశ్నించారు.