Harish Rao | హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో భేటీ అవుతున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ కథనాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మాట్లాడుతూ.. కీలక డిమాండ్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు పత్రికల్లో చూశాం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలనుకోవడం సంతోషం. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తొలిరోజుల్లో ఏడు మండలాలను, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఈ అంశంపై పదవీ బాధ్యతల స్వీకరణ కంటే కొద్ది గంటల ముందే తీవ్రంగా కేసీఆర్ స్పందించారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం. పార్లమెంట్లో నిరసన తెలిపి బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశాం. కానీ బీజేపీ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది అని హరీశ్రావు గుర్తు చేశారు.
ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుపై ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి ఏడు మండలాలు, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నాం. ఏడు మండలాలు వచ్చిన తర్వాతనే విభజన సమస్యలపై ముందుకు పోవాలి. వారు పోలవరం కట్టుకుంటే అభ్యంతరం లేదు. భద్రాచలం వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం లేకుండా పోయింది. భద్రాచలంలో సేకరించిన చెత్త వేడాయినికి డంప్ యార్డుకు కూడా స్థలం లేదు. ఆ ఏడు మండలాల ప్రజలు తెలంగాణతో ఉండాలని కోరుకుంటున్నారు. ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలనేది మొదటి ఎజెండాగా పెట్టుకోవాలి. దీని కోసం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవాలి అని హరీశ్రావు డిమాండ్ చేశారు.