Harish Rao | మెదక్ : ప్రజా జీవితంలో పదవికి విరమణ ఉంటుంది.. కానీ ప్రజాసేవకు విరమణ ఉండదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. నాయకుడు అనే వాడు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన సూచించారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
ఆయా మండలాలు, గ్రామాల అభివృద్ధికి ఐదేండ్ల పాటు కష్టపడి పని చేసిన మీరంతా పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మానించడం గొప్ప విషయం అని హరీశ్రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు దుబ్బాక ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రభాకర్ గెలుపునకు అద్భుతంగా కృషి చేశారు. పదవికి విరమణ ఉంటుంది. కానీ ప్రజా సేవకు విరమణ ఉండదు. రేపట్నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకండి. మీరు తప్పకుండా మండలాలు, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని హరీశ్రావు కోరారు.
మీలో చాలా మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, కో ఆపరేటివ్ చైర్మన్లు అవుతారు. మీ సేవలను పార్టీ ఉపయోగించుకుకుంటుంది. సముచితమైన స్థానం కల్పిస్తాం. రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. ఓటమి తర్వాత తప్పకుండా గెలుపు వస్తది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తది అని హరీశ్రావు స్పష్టం చేశారు.