Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సాయిచందర్ మరణాన్ని ఎవరూ ఊహించలేదు. నాతో ఒక కుటుంబ సభ్యుడిగా, సొంత తమ్ముడిలా ఎంతో అండదంగా ఉండేవారు. సంతోషం వచ్చినా మాట్లాడేవారు. దుఃఖం వచ్చినా చెప్పుకునేవారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్లు కలిసి ప్రయాణించాం. ఎంతో ఆత్మీయ అనుబంధం సాయితో ఉండేది. గుండెపోటుతో కేర్ తీసుకువస్తున్నారని చెబితే షాక్ అయ్యాను. కలనా నిజమా అన్నంత షాక్కు గురయ్యాను. పరుగెత్తుకుంటూ కేర్ వెళ్లాను. అక్కడికి వెళ్లే సరికి సాయి మనలో లేకుండా పోయారు. కానీ ఈ రోజు సాయి భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారులు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు అని హరీశ్రావు తెలిపారు.
సాయి మాట, పాట ప్రవహించే నదిలా ఉండేది. ఆ గళం గలగలపారే నదిలా ఉప్పొంగేది. సాయి స్వరంలో నుంచి మాటలు, పాటలు ఎంతో అద్భుతంగా వచ్చేవి. సాయి లేకుండా కేసీఆర్ సభ ఉండేది కాదు. అంత గొప్పగా పార్టీలో కేసీఆర్కు దగ్గరైండు. కేసీఆర్ సాయిచంద్ను ఎంతో ప్రేమించేవాడు. ఉద్యమ సమయంలో ఏ పాట రాయాలన్నా రసమయి, సాయి కుడి ఎడమభుజంగా కేసీఆర్కు ఉండేవారు. ఉద్యమాన్ని ముందుకు నపడంలో కేసీఆర్ అడుగులో అడుగు వేశారు సాయిచంద్. ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్లలేనిది అని హరీశ్రావు పేర్కొన్నారు.
బహిరంగ సభల్లో సాయి మాట్లాడుతుంటే.. రాతిబొమ్మల్లోనా కొలువైన శివుడా పాట పాడితే.. లక్షల మంది కళ్లల్లో నీళ్లు వచ్చేవి. సాయి ఆ పాట పాడుతుంటే మేం కూడా వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాయి కృషిని ఎవరూ మరిచిపోరు. చట్టసభల్లో అడుగుపెట్టాలనే కల సాయికి ఉండేది. కేసీఆర్ ఆ అవకాశం ఇస్తారని చెప్పేవాడిని. కానీ దురదృష్టం సాయిని వెంటాడుతుందని ఊహించలేదు. గొప్ప కళాకారుడు, నాయుడిని బీఆర్ఎస్ కుటుంబం కోల్పోయింది అని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్న ఎన్నికల సభల్లో సాయి లేని లోటు కనిపించింది. ప్రతి సభలో సాయిని గుర్తు చేసుకున్నాం. సాయి నిస్వార్థంగా పని చేశారు. రాష్ట్రం ఏర్పాటు కావాలి.. నా జాతి బాగుపడాలని కష్టపడి పని చేశారు. సాయి చనిపోయి ఏడాది అవుతుందంటే నమ్మలేకపోతున్నాం. మనలో సాయి ఉన్నట్టే అనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. ఏ ఆపద కష్టం వచ్చినా ఒక తోబుట్టువుగా సాయి రజినికి అండగా ఉంటాం అని హరీశ్రావు స్పష్టం చేశారు.