దుబ్బాక/సిద్దిపేట, జూలై 3: ప్రజాపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట, దుబ్బాకలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐదేండ్ల పదవీకాలం ముగిసినందుకు ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఆగమైందని పేర్కొన్నారు. హత్యలు, లైంగికదాడులు, ఆత్మహత్యలు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా లక్ష రూపాయలతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారని, ఇప్పుడు బంగారం కాదు కదా, ఇచ్చే రూ. లక్ష కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఆసరా పింఛన్లకు కోత పెట్టారని, కరెంటు కోతలతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు పోతే విద్యుత్తు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్కు పాలన చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.
ఆంధ్రాలో 4వేలు పింఛన్ ఇస్తున్నరు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ. 4 వేల పింఛన్ ఇచ్చిందని, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా కొత్త పెన్షన్ ఇవ్వకపోగా, పాత పింఛన్లో కోతపెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో కాలంతో పనిలేకుండా రైతులు పంటలు పండించారని, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో మూడుశాతం వరినాట్లు మాత్రమే వేశారని అధికారులు చెప్తున్నారని తెలిపారు.
వచ్చేది బీఆర్ఎస్ సర్కారే
ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేక ఏర్పడిందని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో పచ్చని చెట్లు స్వాగతం పలికితే, నేడు చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు.
ప్రజలు తిరిగి బీఆర్ఎస్ను కోరుకుంటున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.