హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం ఉన్నదని బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నేత ఇంతియాజ్ విమర్శించారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేస్తే వాటిని ఎత్తేసేందుకు కాంగెస్ ప్రభుత్వం కుట్రలు మొదలుపెట్టిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు బైకాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ దానిష్తో కలిసి గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మైనార్టీ డిక్లరేషన్లో ఒక పథకం కూడా అమలు చేయలేదని, ఒక పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ముస్లింల కోసం నిధులు కూడా విడుదల చేయడం లేదని, ఇవన్నీ చూస్తున్న ముస్లిం మేధావులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ముస్లింల ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడంపై ఎందుకు అడగడం లేదని నిలదీశారు. హజ్యాత్రకు కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పారు. మైనార్టీ సబ్ప్లాన్ ఎప్పుడు పెడుతారని, కుట్టుమిషన్లు ఎప్పుడిస్తారని, 100 శాతం సబ్సిడీ డబ్బు ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.
ఎంఫిల్ చేసిన వారికి 5 లక్షలు ఇస్తామని చెప్పారని, అసలు ఎంఫిల్ను ఎప్పుడో తీసేశారని, కనీస అవగాహన లేకుండా ముస్లిం డిక్లరేషన్లో పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడునెలలవుతున్నా ఇప్పటివరకు మైనార్టీల సంక్షేమం కోసం ఒక సమీక్ష కూడా చేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేసిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 శాతం సబ్సిడీ కింద లక్ష రూపాయలు, మహిళలకు కుట్టు మిషన్లు అందించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ డబ్బులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయని, వాటిని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుట్టు మిషన్లపై కేసీఆర్ ఫొటో ఉన్నదనే కారణంతోనే పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.